MLA Budda Rajasekhar Reddy: ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడాది గడవకముందే టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన పార్టీకి తలనొప్పిగా మారుతోంది. తాము ప్రజా ప్రతినిధులమని, సేవకులమని మరచి వ్యక్తిగత ఆగ్రహాలను బయటపెడుతున్న తీరు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
ఘటన ఎలా జరిగింది?
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ వద్ద వాహనాలను అటవీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి, వెంటనే అనుమతించకపోవడంతో బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే సిబ్బందిని పిలిపించి, దురుసు ప్రవర్తన ప్రదర్శించారు. డ్రైవర్ కరీముల్లాను చెంప చెళ్లుమనిపించి, అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం.
తర్వాత ఆయన, అనుచరులు నలుగురు అటవీ ఉద్యోగులను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అర్థరాత్రి రెండు గంటల వరకు తిప్పుతూ దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నుంచి మొబైళ్లు, పర్సులు, నగదు లాక్కుని, ఒక కాటేజీకి తీసుకెళ్లి కొంతసేపు బంధించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.. నేడు క్యాబినెట్ కీలక భేటీ
సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రజా ప్రతినిధులు ఇలా వ్యవహరించడం తగదని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా సూచించారు.
పవన్ కల్యాణ్ స్పందన
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ప్రజా ప్రతినిధులు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలని, ఉద్యోగుల విధి నిర్వాహణకు అడ్డంకి కలిగించేవారిని ఎంత పెద్దస్థాయి వ్యక్తులైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కేసు నమోదు
బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములునాయక్, గార్డు గురువయ్య, డ్రైవర్ కరీముల్లా ఉన్నారు. మరో ఉద్యోగి వివరాలు సేకరిస్తున్నారు.
పార్టీపై ప్రభావం
ఇటీవల గుంటూరు ఎమ్మెల్యే నజీర్, అనంతపురం వెంకటేశ్వరరావు, ఆముదాలవలస కూన రవికుమార్ ప్రవర్తనపై కూడా విమర్శలు వినిపించిన నేపథ్యంలో, ఇప్పుడు బుడ్డా రాజశేఖర్రెడ్డి ఘటన టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.
ప్రజా సేవ కోసం ఎన్నుకున్న ప్రతినిధులు ఇలాంటి సంఘటనల్లో పాల్గొనడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనే ఆందోళన టీడీపీ అధినేత చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది.