Kerala: కేరళలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంజుతాంబలం వీరేర్కావు దేవాలయంలో సోమవారం రాత్రి బాణాసంచా పేల్చిన సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 150 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని కాసర్గడ్, కన్నూర్, మంగళూరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. వారిలో వినాలని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అర్థరాత్రి వేళ ఫైర్క్రాకర్స్ కాల్చారని, అయితే ఆ బాంబు నిప్పు.. సమీప షెడ్డులో ఉన్న బాణాసంచాపై పడి ఉంటుందని, దాని వల్ల ప్రమాదం భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
షెడ్డు నుంచి భారీ స్థాయిలో మంటలు, పొగ రావడంతో.. ఉత్సవానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉత్సవం వేళ కాల్చేందుకు చైనీస్ బాణాసంచా తీసుకువచ్చామని, క్రాకర్స్ పేల్చుతున్న సమయంలో ఓ నిప్పురవ్వ షెడ్డుపై పడి ఉంటుందని అంటున్నారు. స్థానికులు భయానికి గురై వెంటనే ఫైర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా,సంప్రదాయ తెయ్యం పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది.