Asifabad: కొన్ని సార్లు ప్రకృతి ప్రాణాలు కూడా తీస్తుంది.. పని చేసుకుందాంలే అని వెళ్లిన వారు ప్రాణాలు పోయి శవాలుగా తిరిగి వచ్చారు..రోజు కూలి చేసుకుని ఇల్లు గడుపుకునే వారితో విధి ఆడింది.. కానీ ఈ ఆటలో గెలిచింది ఎవరు ఓడింది ఎవరు.. ఎప్పటిలాగే గెలిచేది విధే.. పోయేవి మాత్రం అమాయకపు ప్రాణాలు.. అలానే ఈ ప్రాణాలు కూడా పోయాయి..
తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా గోలేటీ-1 ఇంకైన్ ప్రహరీ మరమ్మతు పనులను కాంట్రాక్టర్ పైడిధర్కు అప్పగించారు. మాచారానికి చెందిన తాపీమేస్ట్రీ నర్సయ్య, మైలారపు శ్రీనివాస్, హిమండి దుర్గారావు ఈ పనులకు వెళ్లారు.
ఈ క్రమంలో పక్కనున్న చేట్టుపై ఉన్న తేనెటీగలు వీరిపై దాడి చేశాయి. ప్రాణభయంతో పరుగులు తీసినా నర్సయ్యకు తీవ్రగాయాలు కాగా, మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నర్సయ్యను గోలేటీలోని సింగరేణి డిస్పెన్సరీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
మృతుడికి భార్య లక్ష్మీ, ముగ్గురు కుమారైలున్నారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, నర్సయ్యకు ముగ్గురు కూతుళ్లుండగా అందరికీ వివాహాలయ్యాయి.
పెద్దకూతురు సంధ్య అన్నీ తానై తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. AITUC నాయకులు ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి 3 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా కాంట్రాక్టర్ తో మాట్లాడి ఒప్పించినట్లు వారు తెలిపారు.