Mithun Reddy Arrest: జగన్ మోహన్ రెడ్డి విషయం తర్వాత. ముందు మిధున్ రెడ్డిని టచ్ చేసే దమ్ముందా? లిక్కర్ స్కామ్లో మొన్నటిదాకా కొంత మంది టీడీపీ క్యాడర్లోనే వినిపించిన అనుమానం ఇది. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి నెల నుండి మొదలు పెడితే ఏడాది దాటిపోయే వరకూ.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్ని కేసులు నమోదవ్వలేదు. పెద్దిరెడ్డిని కనీసం కూర్చున్న చోటు నుండి కదప గలిగారా? ఇక పార్లమెంట్ మెంబర్ అయిన మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయడం సాధ్యమేనా? వేల కోట్ల లిక్కర్ కేసులో వందల మంది సాక్షులు, పదుల సంఖ్యలో నిందితులు, నెలల తరబడి సాగుతున్న విచారణలు. అసలు ఈ కేసు తెమలుతుందా? పాత్రధారుల వద్దే కేసు ఆగిపోతుందా? కింగ్ పిన్లను దాటుకుని బిగ్ బాస్ దాకా సిట్ వెళ్తుందా? ఇలా ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు. ఇప్పుడు ఆ ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు ఒకే సమాధానం.
చంద్రబాబు, పెద్దిరెడ్డి.. పాత స్నేహితులే కాదు. చిరకాల ప్రత్యర్థులు కూడా. అయితే వీరిద్దరి మధ్య రహస్య స్నేహం ఉందా? అలాంటి ఒప్పందం, సయోధ్య ఏదైనా కుదిరిందా? అందువల్లే.. అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం లేదా? ఇలాంటి అనుమానాలు నిత్యం వ్యక్తమయ్యేవి. పెద్దిరెడ్డి అక్రమాలు, అవినీతి పనులు ఏది వెలుగు చూసినా, ఈ సందేహాలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి. అయితే అటువంటి సందేహాలు, అనుమానాలకు తెర దించుతూ, ఎండ్ కార్డ్ వేస్తూ.. పెద్దిరెడ్డి కుమారుడు, వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ జరిగింది.
తప్పుకు దొరికితే, సాక్షాధారాలు పక్కాగా ఉంటే.. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు అన్న సందేశం ఇది. ఆ దిశగా ఇప్పటికే కూటమి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ పాత్రని పార్లమెంట్ వేదికగా బట్టబయలు చేయాలని కూటమి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారాయన. ఈ లిక్కర్ బాగోతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని గైడెన్స్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Crime News: బరితెగిచింది.. ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి లేపేసింది!
నాడు చంద్రబాబును ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసిన జగన్… 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్భందించారు. నేడు లిక్కర్ స్కామ్ కేసులో పక్కా ఆధారాలతో సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ వేయడంతో పాటూ జగన్ మోహన్ రెడ్డిని అష్ట దిగ్భంధనం చేసింది. ఇప్పటికే ఈ కేసులో మిధున్ రెడ్డితో సహా 11 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో ఏ ఒక్కడు బిగ్ బాస్ పేరు చెప్పినా.. అంతిమ లబ్దిదారుడు అరెస్ట్ ఖాయం అన్న మాట వినిపిస్తోంది. ఒక ఫాక్షనిస్ట్ పాలనకు, ఒక రాజనీతిజ్ఞుడి పాలనకు ఇదీ డిఫరెన్స్ అంటున్నారు అనలిస్టులు.
రాజకీయాల్లోనే కాదు.. అవినీతి వ్యవహారాల్లోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మిధున్ రెడ్డి. వెల్ ఎడ్యుకేటెడ్ అయిన మిథున్ రెడ్డి.. పార్లమెంట్ మెంబర్గా వరుసగా గెలుస్తూ వస్తున్నారు మిథున్ రెడ్డి. అయితే ఈయన చూడటానికి జెంటిల్మెన్లా ఉన్నా… అడ్డగోలు పనుల్లో, ప్రజాధనం లూఠీ చేయడంలో అందెవేసిన చెయ్యి అని లిక్కర్ స్కామ్ కేసు బట్టబయలు చేసింది. మిథున్ రెడ్డి నిజ స్వరూపాన్ని గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లలో ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో ఒక ప్రయివేటు ఫంక్షన్లో పవన్, మిధున్ రెడ్డిలు పరస్పరం తారసపడగా రాజకీయాలు చర్చకొచ్చాయట. ఆ మాటల సందర్భంలో… అసలు మా ఇలాఖాలోకి ఎవ్వడిని అడుగుపెట్టనివ్వం అన్నాడట మిధున్ రెడ్డి. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం పుంగనూరులో అడుగు పెట్టింది. ఇవాళ మిథున్ రెడ్డి, రేపు పెద్ది రెడ్డి, ఎల్లుండి సజ్జల రెడ్డి, అంతిమంగా జగన్ రెడ్డి… ఈ సీక్వెన్స్లో అరెస్టులు ఉంటాయని చర్చ జరుగుతోంది. అదే నిజమైతే ప్రజలు కోరుకుంటోంది నెరవేరినట్లే అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు, పరిశీలకులు.
మూడేళ్లకు చంద్రబాబు ఎగిరిపోతాడు అని జగన్ అంటోంటే… 30 ఏళ్లు జగన్ పేరే వినబడకుండా కూటమి పునాదులు వేస్తోందా? జగన్ చెప్తున్న మూడేళ్లు ఓపిక పడితే జరగబోయేది ఇదేనా? మొత్తానికి మేకపోతు గాంభీర్యాలకు మేకు దింపే సమాధానంగా నిలిచింది ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్.