Kavita: గాజులరామారంలో హెచ్ఎండీఏ చేపట్టిన కూల్చివేతల నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై సంచలన ఆరోపణలు చేస్తూ, ఆయన కబ్జా చేసిన 12 ఎకరాల భూమి సంగతి ఏంటని సూటిగా ప్రశ్నించారు.
“పేదల ఇళ్ల కూల్చివేతలో హీరోయిజం ఏముంది?”
గాజులరామారంలో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, కూలిపని చేసుకుని బతికే పేదల ఇళ్లను కూల్చడంలో ఏమాత్రం ధైర్యం లేదని, నిజమైన సాహసం అయితే పెద్దల కబ్జాలను తొలగించడమేనని ఎద్దేవా చేశారు. “ముందు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమి గురించి చర్యలు తీసుకోండి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పండుగ సమయంలో పేదల జీవితాలతో టలు వద్దు
పండుగ సమయంలో పేదల ఇళ్లను కూల్చడం అమానుషమని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆదివారం రోజున కూల్చివేతలు జరపడం దారుణమని కవిత మండిపడ్డారు. బాధితులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని, రూ. 50 వేలు సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
“బుల్డోజర్ వస్తే ముందుగా నేనే అడ్డుగా నిలుస్తా”
వచ్చే నెల 6వ తేదీలోగా బాధితులకు న్యాయం జరగకపోతే ఊరుకోబోమని కవిత హెచ్చరించారు. “మళ్లీ బుల్డోజర్ వస్తే, దానికి అడ్డుగా నిలబడే మొదటి వ్యక్తిని నేనే అవుతా” అని ప్రకటించారు. వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మిన వారిని పట్టుకుని బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
సీఎం పై విమర్శలు
ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేరని, గడీ దాటి రావడం లేదని కవిత విమర్శించారు. ప్రజా పాలన పేరుతో గోడు వినేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాలు తానే సేకరించి ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్తానని, ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు.
ప్రభుత్వ భూముల విషయంలో వైఫల్యం
దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారినా, పోచమ్మ బస్తీ పరిసరాల్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడలేకపోయాయని, ఇప్పుడు హడావుడిగా వచ్చి పేదలపై ప్రతాపం చూపించడం అంగీకారయోగ్యం కాదని కవిత అన్నారు.