Suresh Raina: కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్ యాప్ల కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) వేగం పెంచింది. ఈ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది.అక్రమ బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో విచారణ కోసం ఆయనను ఈడీ పిలిచింది.ఈ కేసులో రైనా తన పాత్ర, లావాదేవీల గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.1xBet వంటి అక్రమ బెట్టింగ్ యాప్లకు రైనా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ దృష్టిలో రైనా నేరుగా బెట్టింగ్ ఆడారా లేక కేవలం ప్రచారం చేశారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రైనా ఈ యాప్ల ప్రచారం ద్వారా అందుకున్న డబ్బు గురించి ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి పలువురు సినీ ప్రముఖులను తెలంగాణ పోలీసులు విచారించారు.
ఈ బెట్టింగ్ యాప్లు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి మోసగించాయని, మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిపాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు మొదట ఈ బెట్టింగ్ యాప్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం, మనీ లాండరింగ్ కోణం వెలుగులోకి రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ దేశవ్యాప్తంగా అక్రమ బెట్టింగ్ యాప్లపై దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ రైనాకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయని, ఈ యాప్లకు చైనా, రష్యా వంటి దేశాల నుంచి నిధులు సమకూరుతున్నాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో సురేష్ రైనా విచారణ కీలకమని భావిస్తున్నారు.