Delhi: ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తొలగించాలి.. ఆప్ నేత డిమాండ్

Delhi: ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిమాండ్ చేసింది. ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.

ఢిల్లీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, తన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై అజయ్ మాకెన్ హద్దులు దాటి తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం 24 గంటల్లో అజయ్ మాకెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ విధంగా జరగనట్లయితే కాంగ్రెస్‌ను ఇండియా కూటమి నుంచి తప్పించేందుకు ఇతర పార్టీలతో చర్చిస్తామని హెచ్చరించారు.

ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కౌంటర్ ఇచ్చారు. 2013లో 40 రోజుల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద పొరపాటు అని, ఈ నిర్ణయంతోనే ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని తెలిపారు. తమ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని సూచించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు.

అదనంగా, ఢిల్లీలో కాలుష్య నియంత్రణ, శాంతి భద్రతల వంటి సమస్యల పరిష్కారంలో బీజేపీ (కేంద్రం) మరియు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రెండూ విఫలమయ్యాయని ఆరోపించారు.

కాగా,ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *