Siddaramaiah: ప్రధాని మోడీకి కర్ణాటక సీఎం సిద్ధమైన సవాల్ విసిరారు. కర్ణాటక ఎక్సైజ్ శాఖలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాన మంత్రి చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.నిరూపించలేకపోతే మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. ఈ దేశ ప్రధాని ఇంత అబద్ధాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. ‘మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి పాల్పడిందని మోదీ ఆరోపించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు రూ.700 కోట్లు సమీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ దేశ ప్రధాని ఇంత అబద్ధాలు చెప్పడం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఈరోజు నేను ప్రధానికి ఓ సవాల్ విసురుతున్నా. ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపించకపోతే ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి’ అని సిద్ధరామయ్య అన్నారు.
మోదీ ఏమన్నారంటే…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, ఆ సొమ్మును మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపించారు. ‘ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుంది. మహారాష్ట్రలో ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రజలు చెప్తున్నారు. కర్ణాటకలోని లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ రాజ కుటుంబానికి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు ఏటీఎంలుగా మారిపోయాయి. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు పాల్పడుతున్నది.’ అని మోదీ ఆరోపించారు
.