Tirumala

Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటల సమయం!

Tirumala: తిరుమల కొండపై కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వేసవి సెలవులు కావడం వల్ల కావచ్చు, స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. లోపల చోటు లేకపోవడంతో వేలాది మంది భక్తులు వెలుపల ఉన్న సాధారణ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు.

దర్శన టికెట్లు లేని భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 30 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, భక్తులు ఓపికతో క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న వారికి తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు.

ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు ఉన్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే 44,107 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం భారీగా వచ్చింది. నిన్న ఒక్కరోజులోనే స్వామివారి హుండీ ఆదాయం అక్షరాలా 3.94 కోట్ల రూపాయలు వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *