Formula E Race Case: హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేస్ వెనుక భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు చేరడానికి quid pro quo (నీకింత-నాకింత) పద్ధతిలో పెద్ద ఎత్తున డబ్బు బదిలీలు జరిగాయని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నిర్ధారణకు వచ్చింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ ఏసీబీ ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపింది. మంగళవారం ఈ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరగా, విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. గవర్నర్ అనుమతి లభిస్తే, ఈ కేసులో నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసే దిశగా ఏసీబీ ముందుకు సాగనుంది.
ఏమైందీ వ్యవహారం?
2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్ములా ఈ కారు రేస్ సీజన్-9 జరిగింది. ఈ ఈవెంట్ నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణం, ఇతర లాజిస్టిక్స్ బాధ్యతలు హెచ్ఎండీఏ (HMDA) భరించగా, ఏస్ నెక్స్ట్జెన్ సంస్థ స్పాన్సర్గా వ్యవహరించింది. ఈవెంట్ కోసం హెచ్ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు చేసింది.
సీజన్-10 నిర్వహణకు ముందే ఏస్ నెక్స్ట్జెన్ ఆర్థిక భారాన్ని మోయలేక వెనక్కి తగ్గింది. దీని ఫలితంగా, ప్రభుత్వమే ఈవెంట్ ఖర్చును భరించేందుకు కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి రూ.45 కోట్ల నిధులు విడుదల చేయగా, ఆ నిధుల్లో పెద్ద భాగం ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు చేరింది.
ఏసీబీ నివేదిక ప్రకారం, ఈ సంస్థల నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి చేరాయి. ఈ లావాదేవీలు quid pro quo కోణాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Donald Trump: నా ఫ్రెండ్ మోడీ తో మాట్లాడి.. గుడ్ న్యూస్ చెబుతా
నిబంధనల ఉల్లంఘనపై సీరియస్ ఆబ్జర్వేషన్లు
-
ఎన్నికల నియమావళి అమల్లో ఉండగానే ఈ చెల్లింపులు జరిగాయని ఏసీబీ నివేదిక పేర్కొంది.
-
రూ.10 కోట్లకుపైగా నిధులు విడుదల చేసేటప్పుడు ఆర్థికశాఖ అనుమతి అవసరం ఉన్నప్పటికీ, అలా జరగలేదు.
-
విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినా, ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు.
-
ఈవెంట్ రెండో దశ జరుగకముందే డబ్బులు చెల్లించారు.
నిందితుల జాబితా
-
కేటీఆర్ – మాజీ మున్సిపల్ శాఖ మంత్రి
-
అర్వింద్ కుమార్ – ఐఏఎస్ అధికారి, అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్
-
బీఎల్ఎన్ రెడ్డి – మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్
-
గోవాడ కిరణ్ మల్లేశ్వర్ రావు – ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్
-
ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు
-
ఏస్ నెక్స్ట్జెన్ సంస్థ సీఈవో కిరణ్రావు
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ ఫలితం
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 2న తిరస్కరించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగాలనే అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో ఏసీబీ చకచకా పావులు కదిలించి, ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ లేఖ పంపింది.
భవిష్యత్ పరిణామాలు
గవర్నర్ అనుమతి లభిస్తే:
-
ఛార్జిషీట్ దాఖలు అవుతుంది.
-
అవసరమైతే అరెస్టులు జరగొచ్చు.
-
కేసు కోర్టులో వేగవంతంగా నడిచే అవకాశాలు ఉన్నాయి.