Kadiyam Srihari

Kadiyam Srihari: బీఆర్‌ఎస్ నేతలకు విలువలు ఇప్పుడే గుర్తొచ్చాయా?

Kadiyam Srihari: బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 36 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారని, అప్పుడు విలువలు గుర్తురాలేదా అని కడియం ప్రశ్నించారు.

గతంలో లేని విలువలు ఇప్పుడేనా?
హనుమకొండలో మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై ధీటుగా స్పందించారు. కేసీఆర్‌ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానించారని, అందులో ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరూ తమ పదవులకు రాజీనామా చేయలేదని, ఇప్పుడు మాత్రం బీఆర్‌ఎస్‌ నేతలు విలువలు, నైతికత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు ఒక విధానం, ఇప్పుడు మరొక విధానం అనుసరించడం సరికాదని కడియం అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పని
తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం వెనుక ప్రధాన కారణం స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధి అని కడియం శ్రీహరి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహకారం వల్ల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, సాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చెరువులు నిండాయని చెప్పారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గానికి వచ్చిన నిధులపై తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని, వారి కోసమే కష్టపడతానని పేర్కొన్నారు.

స్పీకర్ నోటీసులపై కూడా కడియం స్పందించారు. కోర్టు స్పీకర్‌కు సూచనలు మాత్రమే చేసిందని, ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. స్పీకర్‌కు సమాధానం ఇచ్చేందుకు తనకు ఇంకా సమయం ఉందని, తగిన సమయంలో తప్పకుండా స్పందిస్తానని వెల్లడించారు. తాను పార్టీ మారి పదవి అనుభవించలేదని, తన పనితీరుతోనే పదవి వచ్చిందని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *