Pakistan: ఇస్లామాబాద్ పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో మిలిటరీ కాన్వాయ్పై బాంబు దాడి చోటు చేసుకుంది. నోష్కి ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ పేలుడులో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడిని ఆత్మాహుతి బాంబు దాడిగా గుర్తించారు.
బలోచ్ వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడి తమ కార్యకలాపమని ప్రకటించింది. బీఎల్ఏ ఫిదాయీ యూనిట్ ‘మజీద్ బ్రిగేడ్’ ఈ దాడిని నిర్వహించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థకు మెయిల్ ద్వారా వెల్లడించింది. “పాక్ మిలిటరీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిపాం. ఎనిమిది బస్సుల్లో ప్రయాణిస్తున్న సైనికులను నాశనం చేశాం. ఈ దాడిలో 90 మంది సైనికులు హతమయ్యారు” అని వారు ప్రకటించారు.
పేలుడు సంభవించిన తర్వాత బీఎల్ఏ ‘ఫతే స్క్వాడ్’ వెంటనే మరో బస్సును చుట్టుముట్టి, అందులోని సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. పేలుడుతో కనీసం ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.
Also Read: Cm revanth: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
Pakistan: గత కొన్ని రోజులుగా బలోచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ప్రయాణికుల రైలును బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేసి 400 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకుని పలువురిని హతమార్చారు. ఆ దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే మరోసారి భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు.
ఈ పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందారని పాకిస్థాన్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు. తాజా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ భద్రతా బలగాలు అలర్ట్కు వెళ్లాయి.