Ktr: ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విశేషంగా కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. సర్వేలు అన్నీ బీఆర్ఎస్ గెలుస్తుందని చూపించాయని, అయితే చివరి మూడు రోజుల్లో ఏం జరిగిందో ప్రజలందరికీ స్పష్టమేనని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయంగా ఉందని ఈ ఉప ఎన్నిక మరోసారి రుజువు చేసిందని తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ, తాము కులం–మతం పేరుతో ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదని, ప్రచారంలో ఎవరైనా కవ్వించినా సంయమనం పాటించామన్నారు. “ప్రభుత్వం దిగొచ్చేలా చేశాం, అదే మా నిజమైన విజయం” అని స్పష్టం చేశారు.
మరింతగా మాట్లాడుతూ, తమ ప్రచారానికి భయపడి అజార్కు మంత్రి పదవి ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. ఏదేమైనా ప్రజాస్వామ్య తీర్పును శిరసావహిస్తున్నామని పేర్కొన్నారు.
దేశ రాజకీయాలపై స్పందించిన ఆయన, బీహార్లో కాంగ్రెస్ పూర్తిగా ఉనికి కోల్పోయిందని కూడా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగానూ నిరాశ చెందవద్దని, “రబ్బర్ బంతిలా మనం కూడా తిరిగి ఎగిరి వస్తాం” అని కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు.

