Konaseema: అంబేద్కర్ కోనసీమలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పేరుతో మోసాలు చేయడం మామూలే. కానీ, రెండేళ్లలో ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఒక కిలాడి లేడీ ఉదంతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును ఆశ్రయించడంతో ఈ దారుణం బయటపడింది.
రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ అనే యువతి, తన తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ అనే మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతోంది. వీరి ప్రధాన టార్గెట్ ఎవరంటే.. ఆర్థిక స్థిరత్వం కలిగి, విడాకులు తీసుకున్న లేదా భార్యతో విభేదాలు ఉన్న ఒంటరి పురుషులు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది.
నీలిమ ముందుగా తనకు తెలిసిన లాయర్ల ద్వారా విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన మగవారి వివరాలను సేకరిస్తుంది. ఆ తర్వాత, ఆ పురుషులతో పరిచయం పెంచుకుని, వారికి మాయ మాటలు చెబుతుంది. డిప్రెషన్లో ఉన్న పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని ప్రేమలో దించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకునే ముందు, ఇల్లరికం రావాలనే కండిషన్ కూడా పెడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్లో దారుణం: ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన 10వ తరగతి కూతురు!
Konaseema: పెళ్లి చేసుకున్న తర్వాత, నీలిమ ఆ పురుషుల నుండి డబ్బులు దోచుకోవడం మొదలుపెడుతుంది. ఎవరైనా ఎదురు తిరిగితే, తనను వివాహం చేసుకున్న ఫోటోలు, సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది. తప్పుడు కేసులు పెడతానని బెదిరించి, వేధింపులకు పాల్పడుతోంది.
రెండేళ్ల కాలంలో ఈ విధంగా 12 మందిని మోసం చేసి, కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందిన ముగ్గురు బాధితులు కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, మోసం చేసిన నీలిమ, ఆమె ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న కిలాడి లేడీ
విడాకుల కోసం కోర్టులో కేసు వేసిన వారు.. డబ్బున్న మగవారే ఈమె టార్గెట్
ఏపీ కోనసీమలో డజన్ పెళ్లిళ్లు చేసుకొని కోట్లు సంపాదించిన యువతి, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం… pic.twitter.com/qy1QTAPYrF
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2025