Kavita: తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి
కవిత మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. “రెండు నెలలు ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటి?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పోరాటం బీసీ రిజర్వేషన్లకే పరిమితమని స్పష్టం చేశారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కవిత కౌంటర్
స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఈటల అంటున్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు రద్దయినట్లుగానే తెలంగాణలో కూడా రద్దవుతాయని చెబుతున్నారు. కోర్టులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈటల తన సొంతంగా మాట్లాడుతున్నారా? లేక బీజేపీ చెప్పించిందా?” అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఈటల బీసీలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
బతుకమ్మ సంబురాలు – తెలంగాణ గుర్తింపు
కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ చింతమడక నుంచి లండన్ వరకు ఘనంగా నిర్వహించబడ్డదని గుర్తుచేశారు. “గిన్నిస్ బుక్ రికార్డుల కోసం కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకే బతుకమ్మ వేడుకలు నిర్వహించాం. బతుకమ్మను తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలబెట్టిన ఘనత కేసీఆర్దే” అని అన్నారు.
ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, “రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిపై గత సర్కార్ ఇచ్చిన గెజిట్ను మార్చి, విగ్రహ రూపురేఖలను సవరించి కొత్త గెజిట్ ఇచ్చింది. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం ఆహ్వానించదగిన విషయం” అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్పై మరిన్ని విమర్శలు
కవిత ఆరోపిస్తూ, “కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసి, మరుసటి రోజు తమ అనుకూలులతోనే కోర్టులో కేసులు వేయించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లలో గందరగోళం ఉంది. గ్రామాల్లో లేని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించారు” అని అన్నారు.
చివరిగా ఆమె డిమాండ్ చేస్తూ, “ప్రభుత్వం చేపట్టిన కులగణన డేటాను బహిర్గతం చేస్తేనే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుంది” అని స్పష్టం చేశారు.