Kangana: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన పురుషులతో సంబంధాల విషయంలో సమాజం ఎప్పుడూ మహిళలనే నిందిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన విమర్శలతో పాటు నేటితరం డేటింగ్ అలవాట్లపై కూడా ఘాటుగా స్పందించారు.
కెరీర్లో రాణించాలనే తపన ఉన్న యువతులను ఆకర్షించేందుకు పెళ్లయి, పిల్లలున్న పురుషులు ప్రయత్నించినప్పుడు.. సమాజం మొత్తం ఆ అమ్మాయినే వేలెత్తి చూపుతుందని కంగనా విమర్శించారు. “ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవాలని చూసే పెళ్లయిన వ్యక్తి తప్పు కాదా? కానీ నింద మాత్రం అమ్మాయి మీదే వేస్తారు” అని ఆమె స్పష్టంచేశారు.
ఆధునిక డేటింగ్ యాప్లను కూడా కంగనా తీవ్రంగా విమర్శించారు. వాటిని *“సమాజంలోని మురికికాలువలు”*గా అభివర్ణిస్తూ, ఆత్మవిశ్వాసం లేని వారు, ఇతరుల గుర్తింపు కోసం తహతహలాడే వారే ఈ యాప్లను ఆశ్రయిస్తారని మండిపడ్డారు. యువత తమ జీవిత భాగస్వామిని చదువు రోజుల్లోనే ఎంచుకోవడం గానీ, పెద్దలు కుదిర్చిన వివాహాల ద్వారానే గానీ ముందుకు సాగడం మంచిదని ఆమె సూచించారు.
అలాగే లివ్-ఇన్ రిలేషన్షిప్లు మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదని హెచ్చరించారు. ఇలాంటి సహజీవనంలో అమ్మాయి గర్భం దాల్చితే కుటుంబం నుంచి మద్దతు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కంగనా వ్యాఖ్యానించారు.
మొత్తం మీద ఆధునిక సంబంధాల కన్నా సంప్రదాయ బంధాలే శ్రేయస్కరమని కంగనా రనౌత్ మరోసారి స్పష్టం చేశారు.