Jairam Ramesh: టియాంజిన్లో ఆదివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ–చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. చైనా దూకుడు, బెదిరింపులకు తలొగ్గుతూ దేశ భద్రతపై రాజీ పడుతున్నారని ఆరోపిస్తూ, ఇది భారత కొత్త భద్రతా విధానమా అని ప్రశ్నించింది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, 2020 గల్వాన్ లోయ ఘటనలో ప్రాణత్యాగం చేసిన 20 మంది భారత జవాన్లను గుర్తుచేశారు. “చైనా దురాక్రమణను గుర్తించకుండా, ప్రధాని మోదీ వారికి క్లీన్చిట్ ఇచ్చారు. సరిహద్దుల్లో యథాతథ స్థితి పునరుద్ధరణ కోరుతున్న ఆర్మీ చీఫ్ సూచనలను పట్టించుకోకుండా చైనాతో రాజీకి దిగడం, వారి దురాక్రమణను చట్టబద్ధం చేయడమే” అని ఆయన విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా–పాకిస్థాన్ కుమ్మక్కును ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ స్పష్టంగా వివరించారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. “ఆ అపవిత్ర పొత్తుపై స్పందించకపోగా, మోదీ సర్కార్ ఇప్పుడు చైనాకు రాచమర్యాదలు చేస్తోంది” అని ఆయన ఆక్షేపించారు.
అంతేకాకుండా, దేశంలో చైనా ఉత్పత్తుల డంపింగ్ పెరిగిపోవడం వల్ల MSME రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై చైనా నిర్మిస్తున్న భారీ హైడల్ ప్రాజెక్టు ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదమని, కానీ ప్రభుత్వం దానిపై స్పందించడం లేదని విమర్శించారు.
ఇకపోతే, అధికారిక వర్గాల ప్రకారం మోదీ–జిన్పింగ్ భేటీలో ఇరుదేశాలు ఆర్థిక పురోగతికి దోహదపడే స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించుకోవాలని నిర్ణయించుకున్నాయి.