Hyderabad Metro

Hyderabad Metro: రూ.19 వేల కోట్లతో మెట్రో రెండో దశ మలి భాగం.. కొత్తగా చేరిన మెట్రో రూట్లు ఇవే..

Hyderabad Metro: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థ మరింతగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. మెట్రో రైలు రెండవ దశలో భాగంగా ‘ఫేజ్ 2బి’ విస్తరణకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రూ.19,000 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో మొత్తం మూడు ప్రధాన మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలను విస్తరించనున్నారు.

విస్తరిస్తున్న మూడు కీలక మార్గాలు

  1. జేబీఎస్ – మేడ్చల్ (24.5 కి.మీ):
    తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆంక్షల దృష్ట్యా జేబీఎస్ నుంచి ఈ మార్గాన్ని తక్కువ ఎత్తులో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

  2. జేబీఎస్ – శామీర్‌పేట్ (22 కి.మీ):
    కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట మార్గంగా శామీర్‌పేట వరకు మెట్రో నిర్మించనున్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో భద్రతా కారణాల వల్ల దాదాపు 1.5 కిలోమీటర్ల భూగర్భ మార్గాన్ని ఈ డీపీఆర్‌లో ప్రతిపాదించారు. మెట్రో రైలు రన్‌వే కిందుగా సాగేలా ప్రత్యేక డిజైన్ చేశారు.

  3. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ – ఫ్యూచర్ సిటీ (40 కి.మీ):
    ఈ మార్గంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్ భూగర్భంగా ఉంటే, రావిర్యాల వరకు ఎలివేటెడ్‌గా రైలు నడవనుంది. అక్కడి నుంచి ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో మరో 18 కి.మీ భూగర్భ మార్గంగా అభివృద్ధి చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Jairam Ramesh: విదేశాంగ మంత్రి ఎక్కడ… జైశంకర్ మౌనంపై కాంగ్రెస్ ప్రశ్నలు

జేబీఎస్‌ను కీలక రవాణా కేంద్రంగా అభివృద్ధి

ఈ మూడు మార్గాల ప్రారంభ బిందువుగా జేబీఎస్ స్టేషన్ పనిచేస్తుంది. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కీలక ఇంటర్‌చేంజ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో నగరంలో మెట్రో రవాణా మరింత సమర్ధవంతంగా మారనుంది.

నిధుల సమీకరణ – కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యం

ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు, కేంద్ర ప్రభుత్వం 18 శాతం నిధులు సమకూర్చనుండగా, బ్యాంకుల ద్వారా 48 శాతం రుణంగా సేకరించనున్నారు. మిగిలిన 4 శాతం నిధులను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) మోడల్ ద్వారా సమీకరించనున్నారు.

డబుల్ డెక్ ప్రణాళికకు చుక్కెదురు

ప్రాథమికంగా జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట్ మార్గాల్లో డబుల్ డెక్ నిర్మాణం అనాలోచించారు. ఒకే స్తంభంపై కింద రహదారి, పైన మెట్రో రైలు ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే, స్టేషన్లు అధిక ఎత్తులో ఉండటం వల్ల ప్రయాణికులకు అసౌకర్యంగా ఉండే ప్రమాదం ఉండటంతో ఆ ప్రణాళికను విరమించారు.

ప్రాజెక్టుకు శాసన, కార్యనిర్వాహక ఆమోదం కుదురుతున్న దశ

ఈ డీపీఆర్‌లను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు ఇప్పటికే ఆమోదించగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో పెట్టింది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు. ఆపై కేంద్ర ప్రభుత్వానికి సమర్పణ జరగనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *