Devotional: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
భక్తులు గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ఆలయాల్లో కార్తీక సోమవారం రద్దీ కొనసాగుతోంది. భక్తులు నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక స్నానాలు చేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా చెరువుగట్టు దేవస్థానంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు వేచి చూస్తున్నారు.