Delhi: దేశంలో మళ్లీ కరోనా కలకలం.. 4 వేల మార్కు దాటిన కేసులు

Delhi: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ భయాందోళనలు పెంచుతోంది. ఇటీవల కొవిడ్-19 యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు కరోనా మహమ్మారికి బలవగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మంగళవారం నాటికి 4,026కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేరళలో అత్యధిక కేసులు

దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మంగళవారం ఒక్కరోజే 171 కొత్త కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,416గా ఉంది.

ఢిల్లీ, మహారాష్ట్రలో కేసుల పెరుగుదల

రాజధాని ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 393కి పెరిగింది. మహారాష్ట్రలో 69 కొత్త కేసులు వెలుగుచూశాయి, అక్కడ ప్రస్తుతం 494 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి

పశ్చిమ బెంగాల్‌లో తాజాగా 11 కేసులు నమోదవగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొంతమేర కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఐసీఎంఆర్ వెల్లడి – ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కారణం

దేశంలో కొవిడ్ వ్యాప్తి పెరగడానికి ప్రధాన కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు తీవ్రమైనవిగా లేవని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

“ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కానీ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. నిపుణుల సూచనల మేరకు ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించడం, అవసరమైన సమయంలో టెస్టులు చేయించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *