TikTok: భారతదేశంలో ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, టిక్టాక్తో సహా చైనాకు చెందిన అనేక యాప్లపై నిషేధం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కొంతమంది వినియోగదారులకు టిక్టాక్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిందనే వదంతులు వ్యాపించాయి. అయితే, ఆ వెబ్సైట్ ఓపెన్ అయినా, అందులో లాగిన్ అవ్వడం లేదా వీడియోలు అప్లోడ్ చేయడం సాధ్యం కావడం లేదని స్పష్టమైంది. అంతేకాకుండా, యాప్ స్టోర్లలో కూడా ఈ యాప్ అందుబాటులో లేదు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) ఈ సైట్ను ఇప్పటికీ బ్లాక్లిస్ట్లో ఉంచాయని కేంద్రం తెలిపింది.
Also Read: Aarogyasri: ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. ఇదే కారణమన్న టీఏఎన్హెచ్ఏ!
2020లో చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన ఉద్రిక్తతల తర్వాత, భారతదేశ ప్రజల సమాచార భద్రత, గోప్యత, మరియు దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావించింది. ఈ కారణాల వల్ల, టిక్టాక్, పబ్జీ, షేరిట్, యూసీ బ్రౌజర్ వంటి మొత్తం 59 చైనా యాప్లను మొదట నిషేధించారు. తరువాత సెప్టెంబర్లో మరో 118 యాప్లను బ్యాన్ చేసి చైనాకు గట్టి షాకిచ్చారు. ఈ నిషేధం ఇప్పటికీ అమల్లో ఉంది.
భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్నందున, టిక్టాక్ తిరిగి వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, చైనా విదేశాంగ మంత్రి ఇటీవలి భారత పర్యటన, మరియు ప్రధాని రాబోయే చైనా పర్యటన ప్రణాళికలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే, ఈ దౌత్యపరమైన పరిణామాలు యాప్ల నిషేధానికి సంబంధించినవి కావని కేంద్రం స్పష్టం చేసింది. భద్రతా సమస్యల విషయంలో భారత్ రాజీ పడదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో, టిక్టాక్ తిరిగి వస్తుందనే వార్తలు అవాస్తవాలని రుజువయ్యాయి.