Addanki dayakar: తెలంగాణలో రాజకీయ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసరడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇచ్చిన సవాల్కు అనుగుణంగా కేటీఆర్ మంగళవారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి ఎదురు చూశారు. ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డికి పాలనపై కనీస అవగాహన లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేని పరిస్థితి. మేం చర్చకు సిద్ధమని వస్తే, సీఎం ఢిల్లీకి వెళ్లిపోతారు. కనీసం మంత్రులని అయినా పంపలేదు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి. చర్చకు దమ్ము లేకపోతే సవాళ్లు ఎందుకు? రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి” అని తీవ్ర విమర్శలు చేశారు.
దీనికి కౌంటర్గా కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందిస్తూ, “కేటీఆర్ ఓ బచ్చా. ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అర్హతే లేదు. లక్షల కోట్ల అవినీతితో వచ్చిన అహంకారం మాట్లాడుతోంది. ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన మీరు, దోపిడీ చేసిన మీరు ఇప్పుడు బాధితుల్లా నటిస్తే నమ్మబుద్ధి కాదు. దమ్ముంటే ముందుగా కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించండి. ఫోన్ ట్యాపింగ్ బాగోతాల వల్లే కాంగ్రెస్కు 100 సీట్లు వచ్చాయి” అని ఘాటుగా విమర్శించారు.
ఇదే సమయంలో అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ, “రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల భరోసా నిధులు విడుదల చేశాం. సంక్షేమ కార్యక్రమాలపై అసెంబ్లీ వేదికగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అసలు చర్చకు భయపడేది బీఆర్ఎస్. సభ నిర్వహణకు కేసీఆర్తో లేఖ రాయాలి” అని డిమాండ్ చేశారు.