Pawan Kalyan: అటవీ భూముల ఆక్రమణలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ యుద్ధ భేరి మోగించారు. మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళంపేట రక్షిత అటవీ భూముల అక్రమ కబ్జాపై ఆయన చేపట్టిన చర్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి.
76.74 ఎకరాల (మరికొన్ని నివేదికల ప్రకారం 104 ఎకరాలు) రక్షిత అటవీ భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు.
ఏరియల్ సర్వే.. ఆక్రమిత ప్రాంతం వీడియో రికార్డింగ్
పవన్ కళ్యాణ్ మంగళంపేట అటవీ భూముల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని స్వయంగా వీడియో తీసి, ఉల్లంఘనల తీవ్రతను సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కేబినెట్ మంత్రులకు దీనిపై నివేదించారు.
ఆ వెంటనే, అటవీ భూముల కబ్జాపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధికారులకు డీసీఎం పవన్ కళ్యాణ్ అల్టిమేటం: ‘కఠిన చర్యలు’
అటవీ భూములు జాతీయ సంపద అని, వాటిని ఆక్రమించినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు జారీ చేసిన ముఖ్య ఆదేశాలు, దిశానిర్దేశం ఇది:
- కబ్జాదారుల వివరాలు వెబ్సైట్లో: ప్రతి ఒక్క కబ్జా వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని ఆదేశించారు. అంతేకాక, అటవీ భూములు ఆక్రమించినవారి పేర్లు, కబ్జా వివరాలు, వారిపై పెట్టిన కేసుల స్థితిని డిపార్ట్మెంట్ వెబ్సైట్లో బహిరంగంగా పెట్టాలి.
- మాజీ మంత్రి ప్రమేయం: ఈ కబ్జాలతో అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు. మాజీ మంత్రి కుటుంబానికి వారసత్వంగా ఈ అడవి భూమి ఎలా వచ్చిందనే దానిపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.
- న్యాయ నిపుణుల సలహాతో చర్యలు: కేవలం శాఖాపరమైన విచారణతో ఆగకుండా, విజిలెన్స్ రిపోర్ట్, న్యాయ నిపుణుల సలహాలతో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- రికార్డుల తారుమారుపై దర్యాప్తు: సర్వే నంబర్ల సబ్-డివిజన్, వెబ్ల్యాండ్ ఎంట్రీలలో తప్పుడు వివరాలు నమోదు చేయడంపై లోతుగా దర్యాప్తు చేయాలి. భూ రికార్డులను తప్పుగా మార్చకుండా నిరోధించడానికి వాటిని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు.
- ఎన్నికల అఫిడవిట్ల పరిశీలన: పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లలో అటవీ భూములపై తప్పుడు సమాచారం ఇచ్చారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: Pakistan News:సైనిక ఆధిపత్యంలోకి పాకిస్థాన్..
“రక్షిత అటవీ ప్రాంతాలు లేదా వన్యప్రాణుల మండలాలను ఆక్రమించడాన్ని ప్రభుత్వం సహించదు. అటవీ భూమిని స్వాధీనం చేసుకున్న ఎవరిపైనైనా మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,” అని పవన్ కళ్యాణ్ తన ఆదేశాలలో స్పష్టం చేశారు.
పారదర్శక పాలన, భూ ఆక్రమణలపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాలు… రాష్ట్రంలో భవిష్యత్తులో భూ కబ్జాలకు అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) garu. Hon’ble Deputy CM… pic.twitter.com/6OxRhJEhmb
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 13, 2025

