Ys sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీఎం చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నానంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మాట్లాడుతూ, రోజా ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు తనపై, తన తల్లి విజయమ్మపై గతంలో చేసిన దుష్ప్రచారాన్ని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
“రోజా, వైసీపీ నాయకులు నాపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేశారు. నా రక్త సంబంధీకులే నాపై విష ప్రచారం చేశారు. నేను వైఎస్సార్ కుమార్తె కాదని, విజయమ్మకు అక్రమ సంతానమని దారుణంగా ప్రచారం చేశారు. ఇలాంటి అసభ్య వ్యాఖ్యల వల్ల నేను ఎంత మానసిక బాధ అనుభవించానో ఆలోచించండి” అని షర్మిల ఆవేశంగా అన్నారు.
తన సోదరుడు కష్టాల్లో ఉన్నప్పుడు, రక్త సంబంధాన్ని గౌరవిస్తూ 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్లు షర్మిల గుర్తు చేశారు. “మీరు మానవత్వం లేని వారు. రక్త సంబంధం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. విజయమ్మను పార్టీ నుంచి తొలగించిన రోజే మీ పతనానికి బీజం పడింది. ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోండి” అని వైసీపీ నేతలపై షర్మిల ఘాటుగా విమర్శించారు.
రాష్ట్ర సమస్యల కోసం జరిగే ప్రజా పోరాటాలకు మాత్రమే తన మద్దతు ఉంటుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడతానని షర్మిల స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
