Heatwave Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని, ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ ఈ చేదు వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత మండిపోతాయని, ప్రజలంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ రోజు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 47 డిగ్రీల వరకు ఎండలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 47 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, మరో 88 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే ప్రమాదం ఉంది. అటు తెలంగాణలోనూ ఎండలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు, రేపు తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు అధికారులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ సమయంలో బయట తిరగడం అస్సలు మంచిది కాదని పేర్కొంది. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరం నిర్జలీకరణానికి (డీహైడ్రేషన్) గురికాకుండా ఉండటానికి ఎక్కువ మొత్తంలో నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలోనూ ఎండలు కోరలు చాస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వారం రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. పాకిస్తాన్, రాజస్థాన్ సరిహద్దుల నుంచి వీస్తున్న వేడి గాలుల వల్లే ఈ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల పాటు ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.
