Neha Singh Rathore

Neha Singh Rathore: పెహ‌ల్గామ్ దాడిపై సోష‌ల్ మీడియాలో పోస్టులు.. నేహా రాథోడ్‌పై దేశ‌ద్రోహం కేసు.. ఇంత‌కీ ఆమె ఎవ‌రు ?

Neha Singh Rathore: జానపద గాయనిగా, పొలిటికల్ సెటైరిస్ట్‌గా పేరుగాంచిన నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా, ఆమె చేసిన సోషల్ మీడియా పోస్టులు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా భావించబడుతున్న ఈ పోస్టులు మత ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడి, లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ అనంతరం భారతీయ న్యాయసంహిత (భా.న్యా.స) కింద నేహాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

నేహా సింగ్ రాథోడ్ – ప్రారంభ జీవితం నుంచి ప్రాచుర్యం వరకు

1997లో బీహార్ రాష్ట్రం జందాలో జన్మించిన నేహా సింగ్ రాథోడ్ తన బాల్యాన్ని గ్రామీణ వాతావరణంలో గడిపింది. చదువులోను శ్రద్ధ చూపుతూ కాన్పూర్ విశ్వవిద్యాలయంలో బీఎస్పీ పూర్తి చేసి, 2018లో డిగ్రీ పట్టా అందుకుంది. చిన్నప్పటి నుంచే సింగింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్న నేహా, భోజ్‌పురి జానపద గీతాలను నేర్చుకుని తన గాత్ర ప్రతిభను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించడం ప్రారంభించింది.

సాధారణ మొబైల్ ఫోన్‌లో పాటలు రికార్డ్ చేసి, వాటిని యూట్యూబ్‌, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేస్తూ చిన్నచిన్న విజయాలు సాధించింది. ఆమెను ప్రేరేపించిన వారు భోజ్‌పురి కవులు బికారి ఠాకూర్, మహేందర్ మిశ్రి అని నేహా చెబుతుంది.

రాజకీయ సెటైర్ లోకి అడుగుపెట్టి..

2020లో కరోనా మహమ్మారి సమయంలో నేహా తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. వైరస్ ప్రభావం, ప్రభుత్వ విధానాలపై ఆమె చేసిన సెటైరికల్ వీడియోలు ప్రజల్లో మంచి స్పందన పొందాయి. అక్టోబర్ 2020 నాటికి నేహా పొలిటికల్ సెటైరిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి: Paramilitary: పహల్గాం ఉగ్రదాడి..పారామిలిటరీ దళాలలో 1.11 లక్షల ఖాళీలు

“బీహార్ మే కాబా”, “యూపీ మే కా బీ”, “యూపీ మే కాబా సీజన్ 2”, “ఎంపీ మే కాబా” వంటి పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటి ద్వారా ఆమె సామాజిక అంశాలను, రాజకీయ వ్యవస్థలోని లోపాలను హాస్యరసంతో ప్రశ్నించడంతో విస్తృత ఫాలోయింగ్ ఏర్పడింది. 2021 నాటికి ఆమె యూట్యూబ్ ఛానల్‌కు లక్షకు పైగా సబ్స్క్రైబర్లు చేరారు.

వివాదాల్లో చిక్కుకున్న నేహా

2023లో ఓ గిరిజన కార్మికుడిపై జరిగిన దారుణ ఘటనను టార్గెట్ చేస్తూ నేహా చేసిన వ్యాఖ్యలు మద్యప్రదేశ్లోనూ తీవ్ర చర్చలకు దారితీశాయి. తాజాగా, జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి అనంతరం చేసిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి వివాదంలో చిక్కుకుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిందన్న ఆరోపణలతో, ప్రస్తుతం దేశద్రోహం కేసు ఎదుర్కొంటోంది.

లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నేహాపై నమోదు చేసిన కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. నేహా తన వైఖరిని ఎలా సమర్థించుకోబోతుందో, కేసు దారి ఏవిధంగా మలుపుతీసుకుంటుందో చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *