Uttam Kumar: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రభుత్వంపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. కృష్ణా, గోదావరి నదీజలాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన, దృఢమైన వైఖరిని అవలంబిస్తోందని తెలిపారు. నదీజలాల్లో తెలంగాణకు 70 శాతం వాటాపై వాదనలు సమర్థంగా వినిపించామని చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర జలహక్కుల విషయంలో ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు. గత 20 నెలలుగా ట్రైబ్యునల్, కోర్టుల్లో చిత్తశుద్ధితో న్యాయపోరాటం కొనసాగిస్తున్నామన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసిందని ఆయన విమర్శించారు. ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగి, 148.3 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని వెల్లడించారు. గత పదేళ్లలో లేని స్థాయిలో వరి సాగు జరగడం తెలంగాణ వ్యవసాయ ప్రగతికి నిదర్శనమని అన్నారు.