Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ పోలింగ్ ప్రక్రియ ఈ రోజు (డిసెంబర్ 11) ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, పలుచోట్ల ఏకగ్రీవాలు కాగా, మిగిలిన స్థానాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో అనేక గ్రామాలలో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతుండటంతో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది.
3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించబడ్డాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు ప్రతి కేంద్రం వద్ద నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.
తొలి దశ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
