Hyderabad: ఇటీవల గ్రూప్-1 ఫలితాలపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఘాటుగా స్పందించింది. కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టీజీపీఎస్సీ మండిపడింది.
కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒక్కో మార్కు తేడాతో అభ్యర్థులు ఎంపిక కాకపోవడం సాధారణమని స్పష్టం చేసింది. గ్రూప్-1 ముల్టీ స్టేజ్ ఎగ్జామినేషన్ వ్యవస్థలో మార్కుల తేడాలు సహజమని, దీనిని అనవసరంగా వివాదాస్పదం చేయడం అన్యాయం అని వ్యాఖ్యానించింది….
వాల్యుయేషన్ ప్రక్రియపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ, నిపుణుల ద్వారా ప్రోటోకాల్ ప్రకారమే పేపర్ల మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ఎస్టీ కేటగిరీ టాపర్పై వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన కమిషన్, ఇది ఆ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని ఆందోళన వ్యక్తం చేసింది.
మహిళల కోసం హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కమిషన్ వివరించింది. సుమారు 25 శాతం మహిళా అభ్యర్థులు అక్కడే పరీక్ష రాశారని, అక్కడి నుంచే మెజారిటీ మహిళలు ఎంపిక కావడం అనుమానాస్పదం కాదని స్పష్టం చేసింది. ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలు అసత్యమని, కావాలనే టీజీపీఎస్సీ పరువు పోగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.