Hyderabad: రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హయత్ నగర్ పరిధిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం లేపింది. వివరాల్లోకి వెళితే లోహిత్ అనే విద్యార్థి హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడో తరగతి చదువుకుంటున్నారు. అక్కడే హాస్టల్లో వుండి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్స్ వెళ్లి లోహిత్ వున్న గది తలుపులు కొట్టిన ఎంతకూ తీయక పోవడంతో పాఠశాల సిబ్బందికి తెలిపారు.
దీంతో లోహిత్ గది వద్దకు వచ్చిన సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా లోహిత్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది లోహిత్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం లోహిత్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. షాక్ తిన్న లోహిత్ కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల సిబ్బందితో లోహిత్ కుటుంబ సభ్యులు, బంధువులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని పాఠశాల ఎదుట బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.

