Narendra Modi: దేశ ప్రజలు ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన పిలుపునిచ్చారు. కొత్త జీఎస్టీ విధానాలపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జీఎస్టీ సంస్కరణలతో లాభం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ విధానం వల్ల సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులకు కూడా లాభం చేకూరుతుందని మోదీ అన్నారు. ఈ సంస్కరణల ద్వారా ‘వన్ నేషన్, వన్ ట్యాక్స్’ కల సాకారమైందని పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ విధానంలో జీరో, 5 శాతం, 18 శాతం పన్నులు మాత్రమే ఉంటాయని, దీనివల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని కూడా మోదీ చెప్పారు.
స్వదేశీ ఉత్పత్తులే దేశ గౌరవం
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని మోదీ సూచించారు. “మనం ఉత్పత్తి చేసే వస్తువుల ద్వారానే దేశ గౌరవం పెరుగుతుంది. స్వదేశీ అభియాన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించాలి” అని ఆయన కోరారు.
సరికొత్త చర్చకు దారితీసిన ప్రధాని పిలుపు
గతంలో ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపునిచ్చిన మోదీ, ఇప్పుడు ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులనే వాడాలి అని ఇచ్చిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ప్రజల నుంచి ఈ పిలుపుకి ఎలాంటి స్పందన వస్తుందో, ఏ మేరకు ఇది విజయవంతమవుతుందో చూడాలి.