ROJA AATA ACB VETA: వైసీపీలో ఆ ఇద్దరు లీడర్లకు ఫైర్ బ్రాండ్లుగా పేరుంది. ఇద్దరిలో ఒకరు జూనియర్, ఇంకొకరు సీనియర్. ఇద్దరూ కలిసి గత వైసీపీ ప్రభుత్వ హయాలో వంద కోట్ల ఆట ఆడారు. పనిలో పనిగా అప్పటి ప్రతిపక్ష పార్టీల నేతలపై జాయింట్గా నోరు పారేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఇద్దరికీ జాయింట్గానే కష్టాలు మొదలయ్యాయి.
ఏపీలో విపక్ష వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు చెందిన యువనేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు గుర్తింపు ఉంది. వైరి వర్గాలను టార్గెట్ చేయడంలో వీరిద్దరిదీ అందె వేసిన చేయి అని చెప్పక తప్పదు. అయితే వీరిద్దరికీ జాయింట్ గానే కష్టాలు మొదలైపోయాయని చెప్పాలి. ఎందుకంటే… వైసీపీ అధికారంలో ఉండగా… రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు అంటూ… ఆడుదాం ఆంధ్రా పేరిట ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే శాప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఆరోపణలపై కూటమి సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా అటు రోజాతో పాటు ఇటు బైరెడ్డి కూడా జాయింట్ గానే ఈ కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ROJA AATA ACB VETA: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి సమావేశాల్లో ఈ అంశాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి ప్రస్తావించారు. ఆడుదాం ఆంధ్రా పేరిట రూ.400 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం… ప్రజల సొమ్ముతో ఆటలాడిందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేవలం ప్రచారానికే రూ.35 కోట్లను ఖర్చు చేశారని కూడా తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అఖిలప్రియ వాదనను మరింతగా బలపరచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గౌతు శిరీషలు విచారణకు ఆదేశించాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, విచారణ పూర్తి కాగానే… నివేదికను ప్రభుత్వం ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి చేశారు.
Also Read: Jio SpaceX Deal: మస్క్ స్పేస్ఎక్స్తో జియో జట్టు . . స్టార్లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ భారత్ కు
వాస్తవానికి ఆడుదాం ఆంధ్ర కోసం నాటి ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసిన మాటలో వాస్తవం లేదన్న మంత్రి మండిపల్లి… 45 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రూ.119 కోట్లను ఖర్చు చేశారని వివరించారు. అయితే అందులో మెజారిటీ నిధులను క్రీడా పరికరాలు కొనుగోలు చేసేందుకే వినియోగించినట్లుగా పేర్కొన్నారని ఆయన వివరించారు. అయితే ఆ క్రీడా పరికరాల నాణ్యతపై నాడే విమర్శలు వచ్చాయని… ఈ కారణంగానే కూటమి సర్కారు అధికారంలోకి రాగానే… దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక ప్రచారం కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అయినట్లుగా చూపారని కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంత మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చారన్న వివరాలేమీ లేవన్న మంత్రి… మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలిపారు. ఈ విచారణలో అక్రమాలు ఉన్నాయని తేలితే మాత్రం అటు రోజాతో పాటుగా ఇటు బైరెడ్డికి కూడా కష్టాలు తప్పేలా లేవన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.