Revanth Reddy: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టు భవనాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని, అలాగే న్యాయ వ్యవస్థలో సిబ్బంది నియామకం చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్రంలోని పాత, కొత్త జిల్లాల్లో కోర్టులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీతో తెలంగాణలో న్యాయవ్యవస్థ మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.