Prashant kishore: నితీష్ కుమార్ ఆరోగ్యం బాలేదు.. రాజీనామా చేయాలి..

Prashant kishore : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ఒక కార్యక్రమంలో జాతీయ గీతాలాపన జరుగుతున్న సమయంలో పక్కనున్న వ్యక్తితో మాట్లాడటం విశేషంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జాతీయ గీతాన్ని అవమానించారంటూ రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ కూడా నితీశ్ కుమార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రశాంత్ కిశోర్ నితీశ్ కుమార్ ఆరోగ్య స్థితిపై సందేహాలు వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ మానసికంగా అన్‌ఫిట్‌గా ఉన్నారని, ఆయన శారీరకంగానూ అలసిపోయి పాలనా నియంత్రణ కోల్పోయారని వ్యాఖ్యానించారు. “నితీశ్ కుమార్ ఆరోగ్యం గురించి తొలిసారిగా ఆయన మిత్రపక్ష నేత సుశీల్ కుమార్ మోదీ మాట్లాడారు. అప్పటి నుంచి చాలా మంది మంత్రులు ఆయన ఆరోగ్యంపై వ్యాఖ్యానించారు. కానీ నేను ఈ అంశంపై జనవరి వరకు స్పందించలేదు. బీపీఎస్సీ నిరసనల సమయంలో ఆయన మానసిక స్థితి క్షీణించిందని గ్రహించాను,” అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.

జాతీయ గీతం ఆలపిస్తుండగా నితీశ్ కుమార్ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు ముదిరాయి. ప్రతిపక్ష నేతలు జాతీయ గీతాన్ని అవమానించారంటూ నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్ తన మంత్రివర్గంలోని మంత్రుల పేర్లను కూడా చెప్పలేరని, ఆయన మానసికంగా దృఢంగా లేరని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

“నితీశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రధాని, హోంమంత్రికి నితీశ్ కుమార్ మానసిక పరిస్థితి బాగోలేదని బహుశా తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని వారికి తెలియజేయాల్సిన బాధ్యత బీజేపీదే,” అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

గత కొన్ని వారాలుగా ప్రశాంత్ కిశోర్ నితీశ్ కుమార్ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జేడీ(యూ)ని ఓడించాలని బీహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ నితీశ్‌ను అడ్డుపెట్టుకుని అధికారాన్ని అనుభవిస్తోందని, ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికి మంత్రివర్గ విస్తరణ చేశారని ఆయన ఆరోపించారు.

ఇతర రాజకీయ నేతలు కూడా ఈ వివాదంపై స్పందించారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఘటనను ఖండించారు. “జాతీయ గీతాన్ని అవమానించడాన్ని దేశం సహించదు,” అని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ నాయకత్వం క్షీణిస్తోందని, దీనికి ఈ ఘటన వాస్తవ రుజువు అని అన్నారు.

మరోవైపు, నితీశ్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమారుడు నిశాంత్, జేడీ(యూ) నేతలు పేర్కొన్నారు. నితీశ్ కుమార్ నూటికి నూరు శాతం ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఇంకా బీహార్‌ను సమర్థంగా నడిపించగలరని నిశాంత్ స్పష్టంచేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *