Ponguleti srinivas: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీనితో ఈ చట్టాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
గవర్నర్ ఆమోదించిన భూ భారతి బిల్లు ప్రతిని గురువారం నాడు సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు.
ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
“ప్రజల పాలనలో ప్రజలు కేంద్రబిందువుగా ఉంటారు. మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. రెవెన్యూ శాఖలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా పని చేసి సామాన్య ప్రజలు సంతోషపడే విధంగా సేవలు అందించాలి,” అని మంత్రి పేర్కొన్నారు.