Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ క్యాంపస్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH)ను సందర్శించారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అడ్మిషన్ కోసమే ఈ పర్యటన జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
నిజానికి, మార్క్ శంకర్ గత కొంతకాలంగా సింగపూర్లోని ఒక పాఠశాలలో చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల అక్కడ జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతని కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలవడంతో పాటు, పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు కూడా ఇబ్బంది కలిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన సింగపూర్కు వెళ్లి, చికిత్స అనంతరం మార్క్ శంకర్ను హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఇక్కడ కూడా చిన్నారికి కొన్ని రోజులు చికిత్స అందించిన తర్వాత, మార్క్ శంకర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఈ ఘటన తర్వాత, తన కుమారుడిని ఇకపై భారత్లోనే చదివించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: PM Modi: జూన్ 16, 17 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన.. జీ-7 సమ్మిట్కు హాజరు
Pawan Kalyan: ఈ నిర్ణయం నేపథ్యంలోనే, పవన్ కళ్యాణ్ తన కుమార్తె అంజనాతో కలిసి శుక్రవారం ఉదయం పటాన్చెరు శివారులో ఉన్న ఇక్రిశాట్ ఆవరణలోని ISH పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాలలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల పిల్లలు చదువుతున్నారు. పాఠశాల సౌకర్యాలు, విద్యా విధానం, సిలబస్, విద్యార్థులకు అందించే వసతుల గురించి ఉపాధ్యాయులు, యాజమాన్యంతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు పాఠశాల యాజమాన్యం కూడా పవన్ కళ్యాణ్ రాక గురించి బయటవారికి తెలియకుండా గోప్యతను పాటించింది. మీడియాను కూడా ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. మార్క్ శంకర్ను ఇదే పాఠశాలలో చేర్చనున్నట్లు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆయన సందర్శన అడ్మిషన్ కోసమేనని స్పష్టంగా తెలుస్తోంది.