Parineeti chopra: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా దంపతుల ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. పరిణీతి ఆదివారం ఉదయం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ సంతోషకరమైన వార్తను పరిణీతి–రాఘవ్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “వాడొచ్చేశాడు! మా బాబు… అతను లేని జీవితాన్ని ఊహించుకోలేము. మా చేతులు నిండాయి, మా హృదయాలు మరింత నిండిపోయాయి. మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మాకు సర్వస్వం లభించింది” అంటూ భావోద్వేగంతో నిండిన సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఈ శుభవార్త తెలిసిన వెంటనే అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రసవం కోసం పరిణీతి ఇటీవల ఢిల్లీకి చేరుకున్నారని సమాచారం. ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరగా, అక్కడే బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమీప వర్గాలు వెల్లడించాయి.
రెండేళ్ల క్రితం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పరిణీతి–రాఘవ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 24న జరిగిన ఆ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. లండన్లో చదువుకునే రోజుల్లో మొదలైన వీరి స్నేహం, తర్వాత ప్రేమగా మారి చివరకు జీవిత బంధంతో ఒక్కటైంది.