Danish Kaneria: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తన పౌరసత్వంపై వస్తున్న ఊహాగానాలకు సమాధానమిస్తూ, సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్ తన జన్మభూమి అయినప్పటికీ, తన పూర్వీకుల భూమి అయిన భారత్ తన మాతృభూమి అని కనేరియా స్పష్టం చేశారు. నా దృష్టిలో భారత్ ఒక దేవాలయం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి తనకు భారత పౌరసత్వం తీసుకోవాలనే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. భారత్ అంతర్గత విషయాలపై తాను మాట్లాడటం లేదా తరచుగా అనుకూల వ్యాఖ్యలు చేయడం అనేది భారత పౌరసత్వం పొందాలనే ఆశతో చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.ఒకవేళ భవిష్యత్తులో తనలాంటి ఎవరైనా భారత పౌరసత్వం తీసుకోవాలని అనుకుంటే, తమ కోసం పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఇప్పటికే అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు.
Also Read: IND vs AUS: టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
పాకిస్థాన్ ప్రజల నుండి తనకు ప్రేమ లభించినప్పటికీ, పాకిస్థాన్ అధికారులు, క్రికెట్ బోర్డు (PCB) నుండి తీవ్రమైన మతపరమైన వివక్షను, బలవంతంగా మతం మార్చే ప్రయత్నాలను కూడా ఎదుర్కొన్నానని ఆయన తన పోస్ట్లో వెల్లడించారు. చివరగా, తాను ఎప్పుడూ ధర్మం కోసం నిలబడతానని, తన భద్రత గురించి ఆందోళన చెందవద్దని చెబుతూ… జై శ్రీరామ్ అని తన పోస్ట్ను ముగించారు.డానిష్ కనేరియా పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడిన రెండవ హిందూ ఆటగాడిగా గుర్తింపు పొందారు. ఆయన పాక్ తరఫున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడారు. 2010లో కనేరియాపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల కారణంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిషేధం తర్వాత ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది

