Khammam

Khammam: ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం..

Khammam: ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన ఉధ్రిక్తతకు దారి తీసింది. సత్తుపల్లిలోని ఎస్వీఎస్ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువు తీవ్ర ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం తమ బంధువి ప్రాణం తీసిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మృతురాలు పామర్తి జ్యోత్స్న ఏపీలోని చింతలపూడి మండలం కోటపాడు గ్రామానికి చెందినవారు. గర్భసంచి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను బంధువులు సత్తుపల్లిలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి స్కాన్ చేయించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఎస్వీఎస్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రి వైద్యులు తొలుత రోగినీ పరీక్షించి ఆపరేషన్ అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్ బ్లీడింగ్ తీవ్రమై, బ్లడ్ ప్రెషర్, హీమోగ్లోబిన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడం వల్ల పరిస్థితి సీరియస్‌గా మారిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమెను బ్రతికించేందుకు తమవంతు ప్రయత్నాలు చేశామని, పరిస్థితి దృష్ట్యా తక్షణమే శస్త్రచికిత్స అవసరమని భావించి బంధువుల నుండి అనుమతి తీసుకున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోయినా సర్జరీ చేశారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మండిపడ్డారు.

ఆపరేషన్ తర్వాత మొదట రోగి ఆరోగ్యం బాగుందని, ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపారు. కానీ కొద్ది గంటల్లోనే ఆమె గుండె ఆగిపోయిందని తెలిపారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జ్యోత్స్న మృతి వెనుక వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువు ఆవేదనతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *