Narendra Modi

Narendra Modi: వందేమాతరం.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది

Narendra Modi: స్వాతంత్య్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన చారిత్రక గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వందేమాతరం’ ప్రాముఖ్యత, దాని చారిత్రక పాత్రపై ప్రసంగించారు. వందేమాతరం గీతం కేవలం పాట మాత్రమే కాదని, అది దేశమాత ఆరాధన, సాధన అని మోదీ అభివర్ణించారు.

వందేమాతరం – ఒక కొత్త భరోసా

ప్రధాని మోదీ ప్రసంగంలో వందేమాతరం గేయం గురించి చెప్పిన ముఖ్య అంశాలు: వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం అని మోదీ పేర్కొన్నారు. ఈ శబ్దం కోట్లాది భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని తెలిపారు. వందేమాతరం మనల్ని పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని, దేశ స్వాతంత్య్రానికి ఇది ప్రధాన ప్రేరణగా నిలిచిందని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: EC Raids: మాజీ MLA మర్రి జనార్ధన్‌ రెడ్డి ఇంట్లో సోదాలు

వందేమాతరం సామూహిక గీతాలాపన ఒక అద్భుతమైన అనుభవం అని, ఒకే లయ, స్వరం, భావంతో ఆలపించడం హృదయాన్ని స్పందింపజేస్తుందని అన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని, వందేమాతరం మూల భావం ‘భారత్… మా భారతి’ అని మోదీ ప్రకటించారు.

ఠాగూర్ ప్రస్తావన, స్మారకాల విడుదల

ఈ సందర్భంగా, ‘వందేమాతరం’ గీతం తొలిసారి ప్రచురితమైన బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనంద్ మఠ్’ నవల గురించి ప్రధాని ప్రస్తావించారు.

“బంకించంద్ర ఆనందమఠ్ కేవలం ఉపన్యాసం మాత్రమే కాదని, అది భారత స్వప్నం” అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలను మోదీ గుర్తు చేశారు. పూర్వీకులు భారత్‌ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారని, భారత్ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని, ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందని అన్నారు.

ఈ 150 ఏళ్ల స్మారకోత్సవాల సందర్భంగా తాము వందేమాతరం స్మారక స్టాంపు మరియు నాణెంను విడుదల చేసినట్లు ప్రధాని తెలిపారు.వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు మరింత ప్రేరణ ఇస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *