Nara Lokesh: నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. నల్లమలలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చేశారు. నిరంతర అన్నదానం జరిగే కట్టడాలు కూడా ఇందులో ఉన్నాయి. టైగర్ జోన్ ఏర్పాటు, అటవీ శాఖ నిబంధనల వల్ల ఫారెస్ట్ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలోని కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేశారు. దీనిపై నారా లోకేష్ క్షమాపణ చెబుతూ, ప్రజల మనోభావాలను అధికారులు దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే, కూల్చేసిన కట్టడాలను తిరిగి తాను నిర్మిస్తానని భక్తులకు హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ
నారా లోకేష్ ప్రకటన భక్తులకు ఊరట కలిగించినప్పటికీ, ఆ శాఖ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చెందింది కావడం విశేషం. ప్రస్తుతం అటవీ శాఖ బాధ్యతలు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. కాశీనాయన కట్టడాలను కూల్చేయొద్దని పవన్ కళ్యాణ్కు ఇప్పటికే చాలా వినతులు అందాయి. కానీ ఆయన నుండి స్పందన రాలేదు. ఇప్పుడు విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎంటర్ కావడంతో భక్తులకు ఊరట లభించింది. అయితే, ఇలా జనసేనకు చెందిన మంత్రిత్వ శాఖలో నారా లోకేష్ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో హోంశాఖ బాధ్యతలు టీడీపీ సరిగా నిర్వహించడం లేదంటూ హోం మంత్రి అనితను పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శించిన ఘటన ఇంకా ఎవరూ మరువలేదు.
ఇది కూడా చదవండి: Cm chandrababu: 70 శాతం సిజేరియన్ చేపించుకుంటుర్రు
తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇలా వేరే మంత్రిత్వ శాఖ గురించి బహిరంగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన శాఖలో నారా లోకేష్ ఎంట్రీ ఇవ్వడం, అదీ జనసేన ప్లీనరీకి ఒక్కరోజు ముందు ఈ పరిణామం జరగడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇంత ముఖ్యమైన విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనేది కాశీనాయన భక్తులకు అర్థం కావడం లేదు.
ఎవరీ కాశీనాయన? ప్రత్యేకత ఏమిటి?
ఉమ్మడి నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో 1895లో జన్మించిన కాశీ రెడ్డి బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. దేశంలోని అనేక తీర్థాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించి, కాశీనాయనగా మారారు. ఆయన పేరు మీద రాష్ట్రంలో అనేక ఆశ్రమాలు వెలసాయి. కడప జిల్లాలోని బద్వేలు సమీపంలో ఉన్న ఆశ్రమం అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ నిత్య అన్నదానం కొనసాగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు తాను బతికి ఉండగానే కాశీనాయన 104 ఏళ్ల వయస్సులో 1999లో పరమపదించారు. ఆయన పేరు మీద అప్పటి ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాయలసీమ ప్రాంతంలో కాశీనాయనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు అటవీ నిబంధనల పేరుతో ఆయన ఆశ్రమాన్ని, అన్నదాన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చేయడం పై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం లోకేష్ ఎంట్రీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగినా, ఇది పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన వ్యవహారమైందే కావడంతో జనసేన దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.