Balakrishna: సినిమా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ కష్ట సమయంలో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి (CM Relief Fund) రూ.50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారని, ముఖ్యంగా తెలంగాణలో పంటలు నష్టపోయి, ప్రాణాలు కోల్పోయిన రైతులకు తన వంతుగా ‘ఉడతా భక్తి’గా ఈ సాయం చేస్తున్నానని చెప్పారు. ఈ విపత్కర సమయంలో ప్రజలకు సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని, భవిష్యత్తులోనూ తన సహాయ సహకారాలు కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: Hyderabad: ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
బాలకృష్ణ ప్రకటనకు ముందు, సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. సినీ ప్రముఖులు వరద బాధితులకు తమ వంతు సాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా 50 ఏళ్లుగా బాలకృష్ణ అందించిన సేవలకు గుర్తింపుగా, ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనకు సత్కారం చేసింది. ఈ సత్కార వేడుకలోనే బాలకృష్ణ ఈ విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఈ గొప్ప మనసు చాటుకున్నందుకు బాలకృష్ణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

