Nalini: తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన నళిని, తాజాగా మరోసారి సంచలనం రేపారు. “ఇదే నా మరణ వాంగ్మూలం” అంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన బహిరంగ లేఖ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్తో తీవ్రంగా బాధపడుతున్నానని, తన జీవితం ముగింపు దశకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం కోసం ముఖ్యమంత్రికి పెట్టుకున్న దరఖాస్తు బుట్టదాఖలైందని వాపోయారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడూ తనను గౌరవించలేదని పేర్కొన్నారు. తాను చనిపోయిన తర్వాత తన పేరును రాజకీయ లాభాల కోసం వాడుకోవద్దని స్పష్టంగా విజ్ఞప్తి చేశారు.
తన జీవితంలో ఒక కోరిక నెరవేరలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవలేకపోయానని ఆమె విచారం వ్యక్తం చేశారు. మరణానంతరం అయినా ప్రధాని తన లక్ష్య సాధనకు తోడ్పడాలని కోరారు. తాను స్థాపించిన **‘వేదామృతం ట్రస్టు’**కు సహాయం అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వచ్చే జన్మలో మోక్షం కోసం ప్రయత్నిస్తానంటూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నళిని చేసిన త్యాగం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. 2010లో భువనగిరి డీఎస్పీగా పనిచేస్తూ ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తనకు సరైన గుర్తింపు దక్కలేదని పలు సందర్భాల్లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నళిని బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లు చింత వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దరితీసింది.