Maoist: దద్దరిల్లిన అడవులు.. భారీ ఎన్కౌంటర్

Maoist: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్–దంతేవాడా అంతర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

పశ్చిమ బస్తర్ డివిజన్‌లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో ఇరువైపులా భారీగా కాల్పులు సాగాయి. చివరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు ధైర్యవంతమైన జవాన్లు తమ ప్రాణాలు అర్పించారు.

 

మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకుని, ఘటనా స్థలం నుంచి SLR, INSAS, 303 రైఫిళ్లు సహా పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా బలగాలు ముట్టడి చేసి, అదనపు బలగాలను మోహరించి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు.

 

బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో పూర్తి వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని తెలిపారు. ఈ ఘటనతో బస్తర్ అంచున మావోయిస్టుల కదలికలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *