KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న మాటలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. అప్పులు, ఆదాయంపైనా లెక్కలతో సహా కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు.
KTR: సీఎం రేవంత్రెడ్డి నువ్వు సర్కార్ నడుపుతున్నావా? లేక సర్కస్ నడుపుతున్నావా? అంటూ కేటీఆర్ ప్రశ్నల వర్షం సంధించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పాడని, నిన్న ప్రెస్మీట్ సమయంలో రూ.8.29 లక్షల కోట్లు అని అనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. పూటకో మాట్లాడుతూ సంఖ్య పెంచుతున్నాడని, అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు వడ్డీ కలిపి చెల్లించే అప్పు కేవలం రూ.2,000 కోట్లేనని, ఇది కాగ్ ఇచ్చిందేనని, కాకి లెక్కలు కాదని స్పష్టంచేశారు.
KTR: తాను ఎక్కడికి పోయినా దొంగలెక్కే చూస్తున్నారన్న సీఎం వ్యాఖ్యలపైనా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. నోట్ల కట్టలతో దొరికిన దొంగ కాబట్టే దొంగ అనకపోతే ఏం అంటారని ఆరోపించారు. చెప్పులు ఎత్తుకపోవడానికి వేరేపార్టీ వాళ్లు రెడీగా ఉన్నారు.. ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లెక్కనే చూస్తారని ఆరోపించారు. రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లిన స్పెషల్ ఫ్లైట్స్, లగ్జరీ ప్రయాణాలను అన్నింటినీ ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
KTR: అందాల పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నిన్ను కోసుకొని తినడం కాదు.. నువ్వే రాష్ట్రాన్ని సీఎంగా అయినప్పటి నుంచి పీక్కొని తింటున్నావని ధ్వజమెత్తారు.
KTR: ఫోర్త్సిటీలో 2,000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్రెడ్డీ? అని కేటీఆర్ విమర్శించారు. నీ అన్నదమ్ములు, నీ బామ్మర్తి, ఇతర నీ కుటుంబ సభ్యుల అందరి ఆదాయం మాత్రం పెంచుకున్నావు. కానీ, రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు.. అని నిలదీశారు. దమ్ముంటే 43 సార్లు ఢిల్లీ ప్రయాణాల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డికి చివరిసారిగా చెప్తున్నా.. కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా.. అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.