KA paul: మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులకు ఆహార ప్యాకెట్లను అందజేసి వారి సమస్యలను ఆరా తీశారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఎన్నికల ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలను గాలికొట్టేయడం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అలవాటు అయిపోయింది” అని పాల్ ఆరోపించారు.
కాంగ్రెస్ 12 సార్లు, బీజేపీ 4 సార్లు, కేసీఆర్ రెండు సార్లు గెలిచారని, కానీ ఇన్నేళ్లుగా ప్రజలు మాత్రం ఎప్పుడూ గెలవలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. వర్షాల కారణంగా ప్రజలు ఆహారం, నివాసం లేక తీవ్ర కష్టాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించలేదని ప్రశ్నించారు.
అభివృద్ధి పక్కనబెట్టి మూడు పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కుల, మత, అవినీతి రాజకీయాలు చేసే పార్టీలను ప్రజలు భూస్థాపితం చేసినప్పుడే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పాల్ అభిప్రాయపడ్డారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి, వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని, అలాగే ఇళ్లు కోల్పోయిన వారందరికీ కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.