Telangana Government: తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అడమి భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్మెంట్ పనులు వీరి పరిధిలోకి వస్తాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లు.. అటవీ భూముల హక్కులు, అటవీ ప్రాంతాల నిర్దారణ చేపడతారు.
Also Read: Piyush Goshal: భారత్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు
వీరిని 1927 చట్టం ప్రకారం నియమిస్తారు. వీళ్లు భూముల వివరాలను పరిశీలించడం, అవకతవకలు ఉన్నవాటిపై విచారణ నిర్వహించడం, అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడం వంటివి చేస్తారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది. అదనపు కలెక్టర్ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్కు సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు, భూముల కేటాయింపులు, పౌరసరఫరాలు, భూభారతి వంటి అంశాలన పర్యవేక్షిస్తారు. అదే విధంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలను చూసుకుంటారు. పరిశుభ్రత, పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు మరియు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తర్వాత వీరు ముఖ్యంగా ఉంటారు.

