భారత జట్టు బౌలింగ్ వెన్నుముక్క అయిన స్టార్ స్పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గాను ‘ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపికయ్యాడు. కేవలం 13 టెస్ట్ మ్యాచ్ లలో 71 వికెట్లు తీసిన బుమ్రా… గత సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే… బుమ్రా మిగిలిన పేసర్ల కంటే తక్కువ యావరేజ్ మరియు ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఎంతో ముందంజలో ఉన్నాడు.
గాయం కారణంగా దాదాపు ఒక సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన బుమ్రా… 2023 చివరి భాగంలో జట్టులోనికి వచ్చాడు. ఇక 2024 సంవత్సరంలో తన అత్యుత్తమ ఆటతీరు కొనసాగించి ప్రపంచ బ్యాటర్లకు సింహస్వప్నంలా మారాడు. సౌత్ ఆఫ్రికాతో మొదలుపెట్టి… ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను సైతం వణికించాడు. ముఖ్యంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అతనిని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు.
ఇది కూడా చదవండి: Tata Steel Chess 2025: టాటా స్టీల్ చెస్ చాంపియన్ షిప్ లో వివాదం..! భారత క్రీడాకారిణి షేక్ – హ్యాండ్ ఇవ్వని ఉజ్బెకిస్తాన్ ప్లేయర్..!
అటు కెప్టెన్ గా కూడా రెండు మ్యాచ్లలో తనదైన రీతిలో సత్తా చాటిన బుమ్రా 71 వికెట్లను కేవలం 14.92 యావరేజ్ తో సాధించడం గమనార్హం. అలాగే ఇదే క్రమంలో టెస్ట్ క్రికెట్ లో 200 వికెట్లు తీసిన బుమ్రా… ఆ మైలురాయిని చేరుకున్న ప్రతీ అంతర్జాతీయ బౌలర్ కంటే తక్కువ యావరేజ్ తో ఈ ఘనత సాధించడం అనేది మామూలు విషయం కాదు.
ఒక్క బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే ఐదు టెస్ట్ మ్యాచ్ లలో 32 వికెట్లు తీసిన బుమ్రా… చివరి టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో గాయం కారణంగా అసలు బౌలింగ్ కు రాలేదు. ఎన్నో దశాబ్దాల సుదీర్ఘమైన భారత క్రికెట్ చరిత్రలో ఈ అవార్డు సాధించిన మొట్టమొదటి పేస్ బౌలర్ బుమ్రా కావడం విశేషం. గతంలో రాహుల్ డ్రావిడ్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ ‘టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను’ గెలుచుకున్న భారతీయులు కాగా… ఇప్పుడు వీరి సరసన బుమ్రా ఆ జాబితాలో చేరాడు.