delhi: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా మే 7న భారత్ సరిహద్దులో నుంచే పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై సూసైడ్ డ్రోన్లతో దాడులు చేసింది. బహావల్పూర్లో జైష్-ఎ-మొహమ్మద్, మురిద్కేలో లష్కరే-తోయిబా స్థావరాలు, సియాల్కోట్, భీంబర్, ముజఫరాబాద్ తదితర ప్రాంతాలు లక్ష్యంగా తీసుకున్నారు. కమాండ్ ఇచ్చిన వెంటనే లక్ష్యాలను ఛేదించే సూసైడ్ డ్రోన్లను ఈ దాడిలో వినియోగించారు. ఇవి ఒకేసారి పేలే లాయిటరింగ్ మ్యూనిషన్స్గా పనిచేస్తాయి. ఈ డ్రోన్ల వాడకంతో మన సైనికుల ప్రాణనష్టం లేకుండా ఖచ్చితమైన దాడి చేయగలిగారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక నేపాలి పౌరుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దాంతో ఏప్రిల్ 29న జరిగిన అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షలో ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఈ ప్రతీకార చర్య చేపట్టారు.
సూసైడ్ డ్రోన్స్ అంటే..
సూసైడ్ డ్రోన్స్ని కామికేజ్ డ్రోన్స్ అని పిలుస్తారు. ఇవి మానవ రహిత వైమానిక ఆయుధాలు. లక్ష్యం మేరకు ఆకాశంలో ఎగురుతూ కమాండ్ అందిన వెంటనే శత్రువుల రహస్య స్థావరాలను ధ్వంసం చేయడం వీటి ప్రత్యేకత. ఈ డ్రోన్లు ప్రాణ నష్టం నివారించడంలో సహాయపడుతాయి. వీటికి ప్రత్యేకమైన నిఘా సామర్థ్యం ఉంటుంది. తద్వారా శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించవచ్చు. సూసైడ్ డ్రోన్ల పరిమాణం, పేలోడ్, వార్ హెడ్ మారుతూ ఉంటుంది. లోయిటింగ్ మందుగుండు సామగ్రిని ఒకేసారి మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి పేలిపోయి టార్గెట్ని ధ్వంసం చేస్తాయి. సూసైడ్ డ్రోన్లను మొదట 1980లో ఉపయోగించారు. 1990, 2000 సంవత్సరాల్లో వీటి వాడకం పెరిగింది. యెమెన్, ఇరాక్, సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో ఈ డ్రోన్లను ఎక్కువగా ఉపయోగించారు. 2021 సంవత్సరంలో వాణిజ్య నౌకలను కూడా ఆత్మాహుతి డ్రోన్లు టార్గెట్ చేస్తున్నాయి.