Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై హైబ్రిడ్ మోడల్కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటమ్ జారీ చేసింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించకపోతే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలించి మరో దేశంలో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు పాకిస్తాన్ జట్టు లేకుండానే టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది.
హైబ్రిడ్ మోడల్ లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అంగీకరించాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.దుబాయ్లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు.చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసినా.. తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్కు తెగేసి చెప్పింది. . భారత్ ఆడే మ్యాచ్లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరిపేలా ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్మోడల్ను సమావేశ ప్రారంభంలోనే పీసీబీ ఇక్కడా తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: WPL: మహిళల ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ అంటే..?
Champions Trophy 2025: దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా… ప్రస్తుత స్థితిలో హైబ్రిడ్మోడల్కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించడంతో పాక్ ఒంటరైంది. ఎందుకంటే పాక్ లో ఆడేందుకు భారత్ రాకపోతే అసలు టోర్నీ నిర్వహించడం అంటే నష్టాలను ఆహ్వానించడమేనని, భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరన్న కారణంతో ఐసీసీ పాకిస్థాన్ విషయంలో స్పష్టంగా ఉంది. ఈ విషయం పాక్కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడనుందని ఐసీసీ సభ్యుడొకరు వెల్లడించారు. ఒకవేళ పాకిస్థాన్ మంకుపట్టుతో టోర్నీ ఆతిథ్య హక్కులు చేజారి.. ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశానికి తరలిస్తే పాకిస్థాన్ రూ.296 కోట్లకు పైగా నష్టపోతుంది.
2008 ముంబయి దాడుల తర్వాత భారత జట్టు పాక్లో పర్యటించనే లేదు. పాకిస్థాన్లో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సిన సమయానికి కూడా పరిస్థితులు మెరుగు పడతాయా లేదా అన్న సందేహలున్నాయి. పరిస్థితులు మారకుంటే వేరే దేశాలు కూడా పాక్కు వెళ్లడానికి అంగీకరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిపై పాక్ స్పందనను బట్టి.. ఐసీసీ ఇప్పుడే టోర్నీని మరో దేశానికి తరలిస్తే ఆశ్చర్యమేమీ లేదు.


One Reply to “Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్ కుదరదంటే తరలిస్తాం..పీసీబీకి ఐసీసీ తుది హెచ్చరిక”